వాగులో పడిన ఆర్టీసీ : బస్సు, కండక్టర్ సహా పలువురికి గాయాలు
తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. శ్యాంపూర్ వద్ద ఇరుకు వంతెన వద్ద బస్సు అదుపుతప్పి వాగులో పడింది. ఈ ప్రమాదంలో బస్సు, కండక్టర్ సహా పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి ప్రయాణికులను బస్సు నుంచి బయటకు తీసి 108 కు ఫోన్ చేసి ఉట్నూర్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 32మంది ఉన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఇరుకు వంతెనలపై ప్రతి ఏడాది ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఇదే బ్రిడ్జి వద్ద పదుల సంఖ్యలో వాహనాలు పడినప్పటికీ అధికారులు వెడల్పు వంతెనల ఏర్పాటుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఉట్నూర్ ఆసిఫాబాద్ రహదారి సైతం గుంతల మయంగా మారి రెండేళ్లుగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది వరకే abp దేశం ఇరుకు వంతెనలు ఉట్నూర్ ఆసిఫాబాద్ రహదారి గురించి కథనం ప్రసారం చేసింది. అప్పటికి కొంత మేర అధికారులు గుంతలు పూడ్చారు. కానీ భారీ వర్షాల కారణంగా మళ్లీ ఎక్కడిక్కడ రహదారులు గుంతల మయంగా మారాయి. ఇరుకు వంతెనలు అలాగే ఉన్నాయి. R&B శాఖ, ప్రభుత్వం ఇప్పటికైనా ఇరుకు వంతెనలు కూల్చి వెడల్పు వంతెనల ఏర్పాటుకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.