రైతుల ఖాతాల్లో నగదు 24 గంటల్లోపే నేరుగా జమ చేశాము : మంత్రి నాదెండ్ల మనోహర్


ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వం విజయవంతంగా నిర్వహిస్తోందని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ చివరి దశకు చేరుకున్నట్లు ఆయన వెల్లడించారు. నేడు ఆయన విజయవాడ కానూరులోని సివిల్ సప్లై భవన్‌లో ధాన్యం కొనుగోలు అంశంపై సివిల్ సప్లై అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2025-26 ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి 94% నగదు 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసినట్లు తెలిపారు. ఇకపై ఉదయం ధాన్యం కొనుగోలు జరిగితే అదే రోజు సాయంత్రానికే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి, నెల్లూరు, బాపట్ల, గుంటూరు తదితర జిల్లాల్లో ఇంకా ధాన్యం కొనుగోలు కొనసాగుతోందని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు ఎదురైన లోపాలను సమీక్షించి, రాబోయే రబీ సీజన్‌కు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని అధికారులకు సూచించారు. త్వరలో తిరుపతిలో రబీ సీజన్‌కు సంబంధించి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ఆర్ఎస్కేల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించేలా శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. రైతులకు కనీస మద్దతు ధర అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కట్టుదిట్టంగా పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. తేమ శాతం, జీపీఎస్, ట్రాన్స్పోర్ట్‌కు సంబంధించిన సమస్యలను సమర్థవంతంగా అధిగమించినట్లు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 6,83,623 మంది రైతుల నుంచి 41.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. వాటి మొత్తం విలువ రూ.9,890 కోట్లు కాగా… అందులో 24 గంటల్లోనే రూ.9,800 కోట్లను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసినట్లు మంత్రి వెల్లడించారు. రైతులు ఇబ్బందులు పడకుండా తొలిసారిగా ప్రత్యేక రైలు సదుపాయం కల్పించి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ధాన్యం తరలింపు చేపట్టినట్లు తెలిపారు. అలాగే గన్ని బ్యాగులు, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్ సదుపాయాలు ముందస్తు అంచనాలతో సిద్ధంగా ఉంచాలని అధికారులకు మంత్రి సూచించారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org