అమెరికాలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు దుర్మరణం
అమెరికాలోని బర్మింగ్ హామ్ లో ఓ అపార్టుమెంటులో జరిగిన అగ్నిప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన సహజారెడ్డి మృతి చెందింది. పోచారం పరిధిలోని చౌదరిగూడకు చెందిన ఉడుముల జయకర్ కు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె అయిన సహజ అమెరికాలో ఎంఎస్ చదువుతోంది.ఈ ప్రమాదంలో సహజారెడ్డితో పాటు కూకట్ పల్లికి చెందిన మరో విద్యార్ధి కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన అపార్టుమెంటులో పదిమంది తెలుగు విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో విద్యార్థులంతా శ్వాస తీసుకోలేక తీవ్ర ఇబ్బంది పడ్డారని చెబుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మిగతా విద్యార్థులను రక్షించారు.