తెలంగాణాలోని ఎడ్యుకేషన్ హబ్ లో తొలి సైనిక్ స్కూల్ ఏర్పాటు ?
తెలంగాణ రాష్ట్రంలోని కొడంగల్ నియోజకవర్గంలో తొలి సైనిక్ స్కూలు ఏర్పాటు కానుంది. దుద్యాల మండలం హకీంపేట వద్ద ఉన్న ఎడ్యుకేషన్ హబ్ లో ఈ ప్రతిష్టాత్మకమైన పాఠశాలను ఏర్పాటు చేయడానికి నిర్ణయం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వస్థలం కావడంతో ఈ సైనిక్ స్కూల్ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ సైనిక్ స్కూల్ గురించి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. కేంద్ర రక్షణశాఖ ఆధ్వర్యంలోని సైనిక్ స్కూల్ సొసైటీ ఈ పాఠశాలకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. కానీ ఈ నెల 21వ తేదీన స్థలాన్ని సందర్శించిన నిపుణుల కమిటీ స్థలంపైన సంతృప్తిని వ్యక్తం చేసింది. దీంతో త్వరలోనే అధికారికంగా ప్రకటన వస్తుందని భావిస్తున్నారు. ఈనెల 24వ తేదీన ఈ సైనిక్ స్కూల్ కు ముఖ్యమంత్రి రేవంత్ భూమిపూజ చేయనున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ విధానంలో ఈ సైనిక్ స్కూల్ ను ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ పాఠశాలకు సంబంధించి అవసరమైన 11 ఎకరాలకు పైగా స్థలం కేటాయింపు, నిర్మాణం, ఇతర నిర్వహణ ఖర్చుల నుండి రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది .అన్ని నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు జరిగితే కేంద్ర ప్రభుత్వం పిపిపి విధానంలో ఈ పాఠశాలను మంజూరు చేస్తుంది. స్కూల్స్ లో సైనిక్ స్కూల్స్ కు ఒక ప్రత్యేకత ఉంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పే ఈ సైనిక్ స్కూల్స్ విద్యార్థులకు ఆరోతరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నాణ్యమైన విద్యను అందిస్తాయి. అయితే సహజంగా సైనిక్ స్కూల్స్ లో అకడమిక్స్ కి ఎలా అయితే ప్రాధాన్యత ఇస్తారో క్రీడలకు, శారీరక దృఢత్వానికి కూడా ప్రాధాన్యతనిస్తారు. విద్యార్థులు ఎన్డీఏ వంటి అకాడమీలలో చేరేందుకు సిద్ధం చేయడం ఈ స్కూల్స్ యొక్క ముఖ్య లక్ష్యం. దీనికోసం పాఠ్యాంశాలతో పాటు ప్రత్యేక శిక్షణను, క్రమశిక్షణతో కూడిన వాతావరణాన్ని ఇక్కడ అలవాటు చేస్తారు. దేశవ్యాప్తంగా ఒకే ఉమ్మడి పరీక్ష ద్వారా ఈ స్కూల్స్ లో ప్రవేశాలను నిర్వహిస్తారు. రాత పరీక్షలో ఎంపికైన విద్యార్థులకు వైద్య పరీక్షలో అర్హత, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది మెరిట్ జాబితాను రూపొందించి ఇందులో అడ్మిషన్లు ఇస్తారు.