ఏపి పోలీస్‌ అకాడమీకి శాశ్వత భవనాలు నిర్మించేందుకు స్థల సేకరణ !


ఆంధ్రప్రదేశ్ లో ఏపి పోలీస్‌ అకాడమీ (అప్పా) కార్యరూపం దాల్చబోతోంది. ఇందుకు సంబంధించిన అడుగులు వేగవంతంగా పడుతున్నాయి. ఇందులో భాగంగా పోలీస్‌ అకాడమీకి శాశ్వత భవనాలు నిర్మించేందుకు వీలుగా స్థల సేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. ఆక్టోపస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ నిర్మాణం కోసం ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం గొండపల్లి వద్ద 76 ఎకరాల భూమిని ఉన్నతాధికారులు కేటాయించారు. ఆయా భూములను ఈ నెల 26న డిజిపి ద్వారకా తిరుమలరావు సందర్శించారు. పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ (గ్రేహౌండ్స్‌) నిర్మాణ ప్రతిపాదన కోసం విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లి గ్రామంలో 498.23 ఎకరాల భూమిని సేకరించారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి శాశ్వత ప్రాతిపదికన పోలీస్‌ అకాడమీ లేకపోవడంతో అనంతపురం పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ (పిటిసి)లో నూతనంగా ఎంపికైన ఎస్‌ఐ స్థాయి నుంచి ఆపై స్థాయి ఉద్యోగులకు శిక్షణ నిర్వహిస్తున్నారు. గ్రేహౌండ్స్‌కు శిక్షణ కేంద్రం లేకపోవడంతో విశాఖపట్నంలో తాత్కాలికంగా పోలీస్‌శాఖ నిర్వహిస్తోంది. రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో పోలీస్‌ అకాడమీలో నూతన అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేవారు. అక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు తదనంతరం పోస్టింగ్‌లు ఇచ్చేవారు. రాష్ట్ర విభజనతో అప్పా తెలంగాణ రాష్ట్రానికి వెళ్లిపోయింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత పోలీస్‌ అకాడమీ లేకుండాపోయింది. తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయి పదేళ్లు పూర్తయినప్పటికీ రాష్ట్రంలో శాశ్వత పోలీస్‌ అకాడమీ ఏర్పాటుకు నోచుకోలేదు. ఇటువంటి పరిస్థితుల్లో పోలీస్‌లు ప్రత్యేకంగా శిక్షణ పొందేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అప్పా త్వరలో కార్యరూపం దాల్చబోతుండటం పట్ల పోలీసు వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. 2026 కల్లా అప్పాకు సంబంధించిన భవనాల నిర్మాణాలు పూర్తి చేసేలా ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం. రాజధాని ప్రాంతం (సిఆర్‌డిఎ) పరిధిలో 2025 జనవరి 26న రిపబ్లిక్‌ డే (గణతంత్ర దినోత్సవం) జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే అంశాన్ని ఇటీవల జరిగిన పోలీస్‌ అమరవీరుల దినోత్సవం సభలో సిఎం చంద్రబాబు ప్రకటించారు. 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org