2024లో దేశం అనేక రంగాలలో గణనీయమైన పురోగతి సాధించింది !
దేశం అనేక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిన సంవత్సరం 2024 అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. గ్రామీణ విద్యుద్దీకరణ, ఫైనాన్షియల్ ఇన్క్లూజన్, డిజిటల్ కెనెక్టివిటీ, లింగ సమానత్వం వంటి అంశాల్లో ఈ ఏడాది అసాధారణ ప్రగతిని సాధించామని అన్నారు. భారతదేశ విధానాలు, కార్యక్రమాలతో దేశంలో నిలకడైన మార్పులు వచ్చాయని, ముఖ్యంగా గ్రామీణ-పట్టణ అసమతౌల్యత తొలగిందని అన్నారు. గ్రామీణ భారతంలోని ప్రజల స్థితిగతులను మెరుగుపరచడంపై ఈ ఏడాది ప్రధానంగా దృష్టిసారించామని అన్నారు. పీఎం జన్థన్ యోజనతో సహా అనేక పథకాలు సానుకూల ఫలితాలనిచ్చాయని, 54 కోట్ల ఫస్ట్ టైమ్ బ్యాంక్ హోల్డర్లు ఫార్మల్ బ్యాంకింగ్ సిస్టంలోకి వచ్చారని చెప్పారు. పీఎం ఆవాస్ యోజనతో గ్రామీణ హౌసింగ్ ముఖచిత్రమే మారిపోయిందని, 3.2 కోట్లకుపైగా గృహాలు మంజూరుచేయగా, 2.7 కోట్ల గృహాలు పూర్తయ్యాయని వివరించారు. లబ్ధిదారులలో 74 శాతం మహిళలే ఉన్నారని చెప్పారు. గ్రామీణ విద్యుద్దీకరణతో గ్రామాల్లో పదేపదే పవర్ కట్స్కు తెరపడిందన్నారు. దేశంలోని ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేసిందని మోదీ అన్నారు. 6 లక్షల గ్రామాలకు 4జి కనెక్టివిటీ వచ్చిందన్నారు. 'ఇండియా గ్రోత్ స్టోరీ'లో గ్రామీణ భారతం ఇప్పుడు చురుకైన భాగస్వామ్యం కలిగి ఉందని చెప్పారు. విధాన నిర్ణయాలు, పాలనలో మహిళల పార్టిషిపేషన్ కూడా పెరిగిందని, శాసనసభలు, పంచాయతీల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగిందని, ఓటింగ్లో పాల్గొంటున్న మహిళల శాతం కూడా పెరిగిందన్నారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్పేస్ (యూపీఐ) ఈ ఏడాది గణనీయంగా పెరిగినట్టు చెప్పారు. 2017లో 400 మిలియన్ లావాదేవీలు జరగ్గా, 2024లో 170 బిలియన్ ట్రాన్సాక్షన్లు జరిగాయన్నారు. ఈ ఏడాది ఒక్క అక్టోబర్ మాసంలోనే రికార్డు స్థాయిలో 500 మిలియన్ ట్రాన్సాక్షన్లు జరిగినట్టు తెలిపారు. పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం విషయంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఎంతో ప్రగతి సాధించామని, 2021లో ఒకే రోజు 25 మిలియన్ కోవిడ్-19 వ్యాక్సిన్లు వేశామని చెప్పారు. వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్లో కూడా గ్లోబల్ లీడర్గా భారత్ నిలిచిందని చెప్పారు. ఆపన్న దేశాలకు 300 మిలియన్ వాక్సిన్లు ఎగుమతి చేశామని తెలిపారు. మౌలిక వసతులకల్పన ఊపందుకుందని, 66 ఏళ్లలో 91,000 కిలోమీటర్ల మేర హైవేలు నిర్మిస్తే, తమ ప్రభుత్వం గత పదేళ్లలో మరో 54,000 కిలోమీటర్ల నెట్వర్క్ను విస్తరించిందని మోదీ తెలిపారు. ఆర్థిక వృద్ధి, కనెక్టివిటీ, వాణిజ్యం, ఉద్యోగ అవకాశాలు దేశవ్యాప్తంగా పెరగడానికి ఈ చర్యలు దోహడపడ్డాయని చెప్పారు. గత దశాబ్ద కాలంలో 1.5 లక్షలకు పైగా స్టార్టప్లు రిజిస్టర్ అయ్యాయని అన్నారు. ప్రభుత్వ ఆర్థిక విధానాలతో మార్కెట్ నుంచి సానుకూల స్పందన రావడంతో పాటు రిటైల్ ఇన్వెస్టర్ల బేస్ పెరిగిదంన్నారు. మ్యూచ్యువల్ ఫండ్స్ ద్వారా ఫైనాన్షియల్ మార్కెట్లో ప్రజల పార్టిసిపేషన్ పెరగడం కూడా ఇండియాస్ గ్రోత్ స్టోరీని, దీర్ఘ కాలిక అవకాశాలను ప్రతిబింబిస్తోందని అన్నారు. 'వికసిత్ భారత్' దిశగా 2025లోనూ మరింత ముందుకు అడుగులు వేయడం ద్వారా 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశం కలను సాకారం చేద్దామని ప్రధాని అభిలషించారు.