క్యూఆర్ కోడ్తో కొత్త పాన్ కార్డులు !
పాన్ కార్డులో కీలక మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.1435 కోట్లతో పాన్ 2.0 ప్రాజెక్ట్ పై ప్రకటన చేసింది. దీనితో కొత్త కార్డులు క్యూఆర్ కోడ్ తో జారీ చేయనున్నారు. ఫలితంగా మరింత వేగంగా, మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి పూర్తిస్థాయి రోడ్ మ్యాప్ ను సిద్ధం చేస్తోంది. ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం పాన్ 2.0 ను ఆమోదించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన భేటీ అయిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. కొత్త కార్డుల కోసం మరోసారి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఉన్న కార్డులను అప్గ్రేడ్ చేసి క్యూఆర్ కోడ్ తో ఉచితంగానే జారీచేస్తామన్నారు. ఈ ప్రాజెక్ట్ అన్ని గవర్నమెంట్ ఏజెన్సీల డిజిటల్ సిస్టమ్ల కోసం పర్మినెంట్ అకౌంట్ నంబర్ ను కామన్ బిజినెస్ ఐడెంటిఫైయర్గా చేస్తుందన్నారు. పాన్ 2.0 నిర్ణయంతో అనేక ప్రయోజనాలున్నాయి. సులభంగానే సమాచారాన్ని పొందవచ్చని తెలిపారు. పాన్ 2.0 ద్వారా క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి మొత్తం సమాచారాన్ని పొందవచ్చు. దీంతోపాటు నకిలీ పాన్ కార్డులకు చెక్ పెడుతుందని భావిస్తున్నారు. దీంతోపాటు పాన్ కార్డు వెరిఫికేషన్ సులభం కానుంది. మొబైల్ యాప్ లేదా ఇతర మార్గాల్లో క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయవచ్చు. అన్ని ప్రభుత్వ శాఖలు తన డిజిటల్ సిస్టమ్లో పాన్ కార్డును ప్రధాన ఐడింటిఫైయర్ గా వినియోగించడమే పాన్ 2.0 లక్ష్యమని తెలుస్తోంది. దీంతోపాటు పన్ను చెల్లింపుల రిజిస్ట్రేషన్ సేవల్లోనూ భారీ మార్పు తీసుకొచ్చేందుకు ఉపయోగపడుతుంది. ఈ విధానం వల్ల డేటా సురక్షితంగా ఉండడం సహా డేటా అంతా ఒకే చోట అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు పాన్, టాన్ వ్యవస్థ మెరుగుపడుతుందని భావిస్తున్నారు. మరియు పేపర్లెస్, పర్యావరణ అనుకూలమైన ప్రక్రియను అవలంభించడం వల్ల మాన్యువల్ తప్పులను తగ్గించడం లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న కార్డుకు క్యూఆర్ కోడ్ తో వచ్చే కార్డుకు తేడా ఉంటుందని తెలుస్తోంది. పాన్ 2.0 క్యూఆర్ కోడ్ లో వ్యక్తి పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో ఉంటాయి. కొత్త కార్డులను QR కోడ్ తో ఉచితంగానే జారీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఉన్న కార్డుల కంటే త్వరలో అందుబాటులోకి రానున్న పాన్ 2.0 కార్డులు మరింత సురక్షితంగా ఉంటాయని తెలుస్తోంది.