ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ !
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఉత్తరాఖండ్లోని పితౌరాగఢ్లో బుధవారంనాడు అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. వాతావరణ ప్రతికూలత కారణంగా సీఈసీతో పాటు రాష్ట్ర డిప్యూటీ చీఫ్ ఎలక్షన్ ఎన్నికల అధికారి విజయ్ కుమార్ జాగ్డాండే ప్రయాణిస్తున్న హెలికాప్టర్ను రాలామ్ గ్రామంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. జిల్లా మెజిస్టేట్ వెంటనే సీఈసీతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఈసీ సురక్షితంగా ఉన్నట్టు ఆయన వెల్లడించారు. సీఈసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ల్యాండ్ అయినట్టు అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్లోని ఆది కైలాష్కు వెళ్తుండగా వాతావరణ ప్రతికూలత ఎదురైంది. దీంతో పైలట్ అత్యవసరంగా పితౌరాగఢ్లో హెలికాప్టర్ను ల్యాండ్ చేశారు. సీఈసీ మంగళవారంనాడు మహారాష్ట్ర, జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్తో పాటు 48 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్సభ స్థానాలకు ఉప ఎన్నికలను ప్రకటించారు. మహారాష్ట్రలో నవంబర్ 20న, జార్ఖాండ్లో నవంబర్ 13, 20 తేదీల్లో ఓటింగ్ జరుగనుండగా, నవంబర్ 23న ఫలితాలు వెలువడతాయి.