విశాఖపట్నంలో టీసీఎస్ ఏర్పాటు !
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో టీసీఎస్ ఏర్పాటు కానున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. విశాఖలో భారీ పెట్టుబడుల ద్వారా టాటా గ్రూపు దాదాపు 10వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది. ముఖ్యంగా ఈవీ, ఏరోస్పేస్, పర్యాటక, స్టీలు రంగాల్లో పెట్టుబడులను పరిశీలిస్తామని ఇదివరకే టాటా గ్రూపు తెలిపింది. ఈ క్రమంలో నిన్న టాటా గ్రూపు ఛైర్మన్ చంద్రశేఖరన్తో మంత్రి నారా లోకేశ్ ముంబయిలో భేటీ అయ్యారు. ఏపీలో ఐటీ రంగం, ఇతర రంగాల్లో అభివృద్ధిపై ప్రజెంటేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం బిగ్ అనౌన్స్ మెంట్ ఉంటుందని ప్రకటించిన లోకేశ్.. సాగర తీరంలో టీసీఎస్ ఏర్పాటు గురించి వెల్లడించారు. లులు, ఒబెరాయ్, బ్రూక్ఫీల్డ్, సుజలాన్ తర్వాత తాజాగా టీసీఎస్ వస్తుండటంతో ప్రముఖ కంపెనీల పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానంగా మారుతోంది. 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' నినాదంతో కంపెనీలను ఆహ్వానిస్తున్నట్లు లోకేశ్ తెలిపారు. ఈ నినాదం ద్వారా పెట్టుబడులకు అత్యుత్తమ వాతావరణాన్ని అందించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. బిజినెస్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ని దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తాము చేస్తున్న కృషిలో టీసీఎస్ ద్వారా ఈ పెట్టుబడి ఓ కీలక మైలు రాయి అని పేర్కొన్నారు.