'ఎక్స్'లో బ్లాక్ చేసిన పోస్టులు చూడొచ్చు ?
'ఎక్స్'లో సరికొత్త వెసులుబాటు రాబోతోంది. ప్రస్తుతం ఓ యూజర్ని ఎవరైనా బ్లాక్ చేస్తే, బ్లాక్ చేసిన వారి పోస్టులుగానీ, వివరాలుగానీ ఆ వ్యక్తికి కనిపించవు. ట్వీట్ చేసినా, రిప్లై ఇచ్చినా, కనీసం వాళ్ల ఫాలోవర్ల జాబితా కూడా చూడటానికి వీల్లేదు. దీనిలో కొద్దిగా మార్పులు చేయబోతున్నట్లు ఎక్స్ పేర్కొంది. తద్వారా యూజర్ని బ్లాక్ చేసినా అవతలి వారి పోస్టులు చూడొచ్చు. కానీ, కామెంట్ చేయడానికి వీలుండదు. అంతేకాకుండా, వారి ఫాలోవర్ల జాబితాను కూడా చూడొచ్చు. మరోవైపు 'ఒక యాప్లోనే సమస్తం' అని ఎక్స్ను కొనుగోలు చేసిన తొలినాళ్లలోనే చెప్పిన ఎలాన్ మస్క్ ఆ దిశగా అడుగులు వేస్తూనే ఉన్నారు. త్వరలోనే ఎక్స్లో పేమెంట్స్ ఆప్షన్ను కూడా తీసుకురాబోతున్నట్లు ఆ సంస్థ వర్గాలు వెల్లడించాయి. ''ప్రస్తుతం ఉన్న 'బ్లాకింగ్' ఆప్షన్ను ఎక్స్ తొలగించబోతోంది. ఖాతా 'పబ్లిక్' అయితే ఒక వేళ ఆ యూజర్ అవతలి వారిని బ్లాక్ చేసినప్పటికీ.. పోస్టులు మాత్రం అందరికీ కనిపిస్తాయి'' అని ఓ యాప్ రీసెర్చర్ ట్వీట్ చేశారు. దీనికి ఎలాన్మస్క్ స్పందిస్తూ.. 'ఇది డెవలప్మెంట్ దశలో ఉంది. త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాం' అంటూ రిప్లై ఇచ్చారు. దీనివల్ల ఎవరినైతే బ్లాక్ చేస్తారో వారి వల్ల ఇబ్బందులుండవని, అయితే, పోస్టులు మాత్రం వారు చూడగలుగుతారని చెప్పారు.