కొత్త సామాజిక పెన్షన్ల అర్హుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ !
తెలంగాణలో కొత్త సామాజిక పెన్షన్ల మంజూరు కోసం అర్హుల జాబితాను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న పెన్షన్లతో పాటు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా నివేదిక సమర్పించాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు పెంచనున్నట్లు ఆమె వెల్లడించారు. తెలంగాణలో వృద్ధులతో పాటు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, చేనేత, స్టోన్ కట్టర్లు, ఫైలేరియా రోగులు, డయాలసిస్ రోగులు, ఎయిడ్స్ రోగులకు పెన్షన్ ఇస్తున్నారు. ఆసరా పెన్షన్ రూ.2016, దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్ను రూ.3016గా అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని చేయూత పథకం కింద వికలాంగులకు రూ.6వేలు, మిగిలిన వారికి రూ.4 వేలు అందిస్తామని కాంగ్రెస్ ముందే చెప్పింది. ఇప్పుడు పెన్షన్ల పెంపు కోసం ఆదేశాలను జారీ చేశారు. నివేదికలు సిద్ధం చేసిన తర్వాత ప్రభుత్వం లిస్ట్ను పరిశీలించి అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.