గీజర్, గ్యాస్ మిక్స్ అయిన విషవాయువు వల్లే చనిపోయారు !
హైదరాబాద్ లోని సనత్నగర్ జెక్ కాలనీలోని ఆకృతి ప్రెసిడెన్సీ అపార్టుమెంట్ రెండో అంతస్తులోని ఫ్లాట్లో దంపతులతో పాటు వారి కుమారుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాత్రూంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసును పోలీసులు ఛేదించారు.మృతులు కర్ణాటకకు చెందిన దంపతులు వెంకటేశ్ (55), మాధవి (50) వారి కుమారుడు హరి(30)గా పోలీసులు తెలిపారు. వీరు ఎలా చనిపోయారో తెలియక పోలీసులు వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించారు. తర్వాత వారి డెత్ రిపోర్టు ఆధారంగా మిస్టరీని చేధించారు. విచారణలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. గత కొంతకాలం నుంచి ఈ కుటుంబం గ్యాస్ సిలిండర్ ద్వారా గీజర్ ని వాడుతున్నారు. ముందుగా కుమారుడు స్నానం చేసేందుకు వెళ్లి సృహ తప్పి పడిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. కుమారుడు పడిపోవడంతో బాత్రూంలోపలికి వెళ్లిన తల్లి, తండ్రి గీజర్ నుంచి గ్యాస్ విడుదల కావడంతో అక్కడికక్కడే స్పృహ తప్పిపడి పోయారు. దాంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. గీజర్, గ్యాస్ రెండు మిక్స్ అయి విషవాయులు వెలువడటంతో ముగ్గురు మృతి చెందినట్లుగా పోస్టుమార్టం రిపోర్టులోనూ వెల్లడైంది. దీన్ని పోలీసులు కూడా నిర్ధారించారు. పోలీసులు ముగ్గురి మృతదేహాలకి పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించారు.