జగన్ ను పలకరించిన రఘురామకృష్ణంరాజు !
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇవాళ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో బద్ధ శత్రువులుగా పేరు తెచ్చుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఇవాళ అసెంబ్లీ సమావేశాల వేళ కలుసుకున్నారు. ఇవాళ గవర్నర్ ప్రసంగానికి నిరసనలు తెలిపేందుకు నల్ల కండువాలతో వచ్చిన జగన్ కు లాబీల్లో రఘురామ కనిపించారు. దీంతో వీరిద్దరి మధ్య ఆసక్తికర సన్నివేశాలు జరిగాయి. రఘురామ జగన్ ను పలకరించారు. అయితే వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ కొన్ని నిమిషాల పాటు మాట్లాడుకున్న తర్వాత వీరిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఈ దృశ్యం చూసిన వాళ్లంతా నోరెళ్లబెట్టక తప్పలేదు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై హత్యాయత్నం చేశారంటూ జగన్ తో పాటు అప్పటి అధికారులపై కేసు పెట్టిన రఘురామకృష్ణంరాజు.. తాజాగా గుంటూరు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో జగన్ కనిపించగానే రఘురామరాజు ఆయన వద్దకు ఎందుకు వెళ్లారు, ఏం మాట్లాడారన్న దానిపై చర్చ జరుగుతోంది.