గ్రామీణ రహదారుల నిర్మాణంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష !
ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలు తీసుకున్న పవన్ కల్యాణ్ వరుసగా ఆయా శాఖలపై సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు.. ఈ రోజు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఏఐఐబీ ప్రతినిధులతో సమావేశమైన ఆయన, గ్రామీణ రహదారుల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామాలకు రహదారుల అనుసంధానంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తేనే ప్రగతి అని అన్నారు. రూ.4,976 కోట్లు నిధులతో 7,213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని, 250 మించి జనాభా కలిగిన ప్రతి గ్రామానికీ రహదారి అనుసంధానం చేయాలని ఆదేశించారు. మ్యాచింగ్ గ్రాంటు 10 శాతానికి తగ్గించేలా కేంద్రంతో మాట్లాడుతాం అన్నారు. గ్రామాల్లో రహదారుల నిర్మాణం వల్ల పేదరిక నిర్మూలనతో పాటు సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు మెరుగవుతాయన్నారు. గ్రామీణ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు మరింత కోరదామన్నారు. గత ప్రభుత్వ హయాంలో బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణ ప్రక్రియ కుంటుబడిందని విమర్శించారు. ఇక, పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ విభాగం పనుల్లో పారదర్శకతను ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో సమీక్షిస్తాం. ప్రత్యేక పోర్టల్ అభివృద్ధి చేస్తాం. ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు వీలుగా ఆ పోర్టల్ లో ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సిన 30 శాతం మ్యాచింగ్ గ్రాంటును 10 శాతానికి తగ్గించే విధంగా అవసరమైన మార్పులు చేయాలని కేంద్రం ప్రభుత్వాన్ని కోరతామని ఈ సందర్భంగా వెల్లడించారు