టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) లో అంచనాలను బ్రేక్ చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2024-25 తొలి త్రైమాసికం నికర లాభాలు తొమ్మిది శాతం పుంజుకుని రూ.11,074 కోట్ల నుంచి రూ.12,040 కోట్లకు చేరుకున్నది. ఆపరేషన్స్ ద్వారా ఆదాయం 5.4 శాతం పెంచుకుని రూ.59,381 కోట్ల నుంచి రూ.62,613 కోట్లకు చేరింది. తమ ఉద్యోగుల్లో 70 శాతం మంది కార్యాలయాలకు వచ్చేశారని టీసీఎస్ సీఈఓ కం ఎండీ కే కృతి వాసన్ తెలిపారు. నికర లాభాల్లో వాటాదారులకు షేర్ మీద రూ.10 ఇంటరిమ్ డివిడెండ్ ఇవ్వాలని టీసీఎస్ బోర్డు నిర్ణయించింది. కొత్తగా 5,452 మంది ఉద్యోగులను నియమించుకున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ముగిసే నాటికి తమ కంపెనీలో 6,06,998 మంది ఉద్యోగులు ఉన్నారని టీసీఎస్ తన క్యూ1 ఆర్థిక ఫలితాల్లో గురువారం తెలిపింది. గత 12 నెలల్లో టీసీఎస్ నుంచి 12.1 శాతం మంది ఉద్యోగులు ఇతర సంస్థల్లోకి (అట్రిక్షన్) అయ్యారు. గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంతో పోలిస్తే అట్రిక్షన్లు 12.5 శాతం నుంచి 12.1 శాతానికి తగ్గాయి. వరుసగా మూడు త్రైమాసికాల తర్వాత ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 5,452 మంది కొత్త ఉద్యోగులు జత కలిశారని టీసీఎస్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో తెలిపింది. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి టీసీఎస్ లో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య 6,01,546 మంది అని పేర్కొంది. క్యాంపస్ సెలక్షన్ల ద్వారా ఉద్యోగులను నియమించుకోవాలన్న వ్యూహంతో ముందుకెళ్తున్నామని టీసీఎస్ చీహెచ్ఆర్ఓ మిలింద్ లక్కడ్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 11 వేల మంది ట్రైనీలను నియమించుకున్నామని, అట్రిక్షన్లను స్థిరీకరిస్తామని చెప్పారు. టీసీఎస్ చరిత్రలో 19 ఏండ్ల తర్వాత టీసీఎస్లో ఉద్యోగుల సంఖ్య ఏడాది ప్రాతిపదికన తగ్గిపోయారు. గత ఆర్థిక సంవత్సరంలో 13,249 మంది ఉద్యోగులను నియమించుకుంటే, 2023-24లో అక్టోబర్-డిసెంబర్ నుంచి జనవరి – మార్చి త్రైమాసికం వరకూ 1759 మంది ఉద్యోగులు తగ్గిపోయారు. ఫ్రాన్స్ లో న్యూ ఏఐ ఫోకస్డ్ టీసీఎస్ పేస్ పోర్ట్, అమెరికాలో ఐఓటీ లాబ్ తోపాటు లాటిన్ అమెరికా, కెనడా, యూరప్ దేశాల్లో తమ డెలివరీ కేంద్రాలను విస్తరించామని టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కం మేనేజింగ్ డైరెక్టర్ కే కృతివాసన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 151 దేశాలకు చెందిన ఉద్యోగులు టీసీఎస్ లో పని చేస్తున్నారు. మొత్తం సంస్థ ఉద్యోగల్లో 35.5 శాతం మంది మహిళలే ఉన్నారు.
0 Comments