బీజేపీ ప్రభుత్వం విపక్ష నేతలపై కేసులు పెట్టి జైలుకు పంపుతూ దేశ ద్రోహులుగా ముద్రవేస్తోంది !
ప్రతిపక్ష నేతలపట్ల నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమర్జెన్సీ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కూడా మమ్మల్ని జైల్లో పెట్టారు కానీ ఏనాడు దేశద్రోహులని దూషించలేదని అన్నారు. ఇప్పటి ప్రభుత్వం విపక్ష నేతలపై కేసులు పెట్టి జైలుకు పంపుతూ దేశ ద్రోహులుగా ముద్రవేస్తోందని విమర్శించారు. ఈ మేరకు జర్నలిస్ట్ నళిన్ వర్మతో కలిసి తను రాసిన 'ది సంఘ్ సైలెన్స్ ఇన్ 1975 (The Sangh Silence in 1975)' అనే ఆర్టికల్ను లాలూ యాదవ్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఆ ఆర్టికల్లో మోడీ సర్కారు వైఖరిని ఎండగట్టారు. ఎమర్జెన్సీ సమయంలో సంఘ్ మౌనంగా ఎందుకున్నదని ప్రశ్నించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడితే తమను జైల్లో వేశారని, మిసా చట్టం కింద మాపై కేసులు బనాయించారని లాలూ యాదవ్ గుర్తుచేశారు. తాను 15 నెలలపాటు జైలు జీవితం గడిపానని ఆయన తెలిపారు. ఇప్పుడు ఎమర్జెన్సీ గురించి ఉపన్యాసాలు దంచుతున్న మోడీ, ఆయన మంత్రివర్గ సహచరుల్లో చాలామంది ఎవరో కూడా అప్పట్లో ఎవరికీ తెలియదని వ్యాఖ్యానించారు. 1975లో నరేంద్ర మోడీ, జేపీ నడ్డా ఎవరికి తెలుసని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూనే, విపక్ష నేతలను తప్పుడు కేసులతో హింసిస్తూనే స్వాతంత్య్ర విలువల గురించి ఊకదంపుడు ప్రసంగాలు చేస్తోందని మండిపడ్డారు.