సిసోడియాకు బెయిల్ నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు !
లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు మంగళవారంనాడు తోసిపుచ్చింది. ప్రభుత్వ ఖజానాకు గండికొట్టి ప్రైవేటు వ్యాపారవేత్తలకు లబ్ధి చేకూర్చే విధంగా లిక్కర్ పాలసీని రూపొందించారన్న ఆరోపణలను సిసోడియా ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించి 2023 ఫిబ్రవరి 6న సీబీఐ ఆయనను అరెస్టు చేయగా, ఇదే కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో 2023 మార్చి 9న ఈడీ అరెస్టు చేసింది. ఈ రెండు కేసుల్లో తనకు బెయిలు మంజూరు చేయాలంటూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ను హైకోర్టు తాజాగా తోసిపుచ్చింది. డాక్యుమెంట్లు సప్లయి చేయడంలో ప్రాసిక్యూషన్ జాప్యం కానీ, అభియోగాల నమోదు విషయంలో విచారణ కోర్టు జాప్యం కానీ ఏమీ లేదని కోర్టు స్పష్టం చేసింది. అయితే, అస్వస్థతగా ఉన్న తన భార్యను ప్రతి వారం కలుసుకుంనేదుకు విచారణ కోర్టు షరుతులపై అనుమతిస్తున్నట్టు కోర్టు తెలిపింది. కాగా, బెయిలు నిరాకరిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టును సిసోడియా ఆశ్రయించనున్నారు.