అదృశ్యమైన బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ మృతి !
వైద్య చికిత్స కోసం బంగ్లాదేశ్ నుంచి భారత్ కు వచ్చిన ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ కొద్దిరోజుల క్రితం అదృశ్యమయ్యారు. ఆయన మృతి చెందినట్లు ఈరోజు ఆయన వ్యక్తిగత కార్యదర్శి అబ్దుర్ రవూఫ్ వెల్లడించారు. కోల్ కతాలోని న్యూటౌన్ లోని ఖాళీ ఇంట్లో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. గత ఎనిమిది రోజులుగా పశ్చిమ బెంగాల్ పోలీసులు, బంగ్లాదేశ్ అధికారులు ఆయన కోసం గాలించారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం బంగ్లాదేశ్ అధికార పార్టీ అవామీ లీగ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ చికిత్స నిమిత్తం పశ్చిమ బెంగాల్ వచ్చి మే 12న బారానగర్ లోని తన స్నేహితుడు గోపాల్ బిశ్వాస్ ఇంట్లో బస చేశారు. వెంటనే వస్తానంటూ రెండు రోజుల తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన ఎంతసేపటికీ తిరిగిరాకపోవడంతో స్నేహితుడితో పాటు బంగ్లాదేశ్ లోని ఎంపీ కుటుంబ సభ్యులు ఫోన్లు చేసినా ఎవరి కాల్స్ కు ఆయన సమాధానం ఇవ్వలేదు. మే 14 నుంచి ఆయన ఫోన్ స్విచ్ఛాప్ వస్తోందని బిశ్వాస్ కోల్ కతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాటి నుంచి ఆయన కోసం పోలీసులు గాలిస్తుండగా ఈ రోజు ఆయన మృతదేహం లభ్యమైంది.