కౌంటింగ్ రోజు పిన్నెల్లి మాచర్లకు వెళ్లొద్దు: ఏపీ హైకోర్టు
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్కు సంబంధించిన ఉత్తర్వులను ఏపీ హైకోర్టు శుక్రవారం జారీ చేసింది. పిన్నెల్లి కదలికలపై ఆంక్షలు విధించింది. ఓట్ల లెక్కింపు రోజు మాచర్లకు వెళ్లొద్దని ఆదేశించింది. నరసరావుపేట కౌంటింగ్ కేంద్రానికి వెళ్లొచ్చని స్పష్టం చేసింది. వచ్చే నెల 6 వరకు లోక్సభ నియోజకవర్గ కేంద్రంలోనే ఉండాలని చెప్పింది. కేసు గురించి మీడియాతో మాట్లాడొద్దని, సాక్షులతో మాట్లాడే ప్రయత్నం చేయొద్దని తెలిపింది. పిన్నెల్లి కదలికలపై పూర్తిస్థాయి నిఘా ఉంచాలన్న ఉన్నత న్యాయస్థానం ఈమేరకు సీఈవో, పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. పాల్వాయిగేటు పోలింగ్కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న పిన్నెల్లిపై జూన్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.