750 కిలోల డ్రగ్స్ కేసు : టీవీ యాంకర్ సారా ఖలీఫా సహా 12 మందికి ఉరిశిక్ష విధించిన ఈజిప్టు కోర్టు
ఈజిప్టు టీవీ షో యాంకర్ సారా ఖలీఫాకు కోర్టు మరణశిక్ష విధించింది. ఆమెతో పాటు మరో 11 మందికి కూడా ఉరిశిక్ష ఖరారు చేసింది. 39 ఏళ్ల సారా ఖలీఫా నేరాలు, భద్రతా అంశాలపై ప్రసారమయ్యే 'మిషన్ ఇంపాజిబుల్' అనే టీవీ షోకు యాంకర్గా వ్యవహరించారు. టీవీ రంగంతో పాటు కాస్మెటిక్ సర్జరీ క్లినిక్, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థను కూడా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆధీనంలోని అల్-అహ్రామ్ కథనం ప్రకారం సారా ఖలీఫా, ఆమె సహచరులు విదేశాల నుంచి ముడి పదార్థాలను దిగుమతి చేసుకుని సింథటిక్ డ్రగ్స్ తయారు చేస్తున్న అంతర్జాతీయ నేర ముఠాలో భాగమయ్యారు. డ్రగ్స్ తయారీ, ప్యాకింగ్, రవాణా, విక్రయాలకు ముఠా సభ్యులు వేర్వేరు బాధ్యతలు నిర్వహించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. పలు ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో 750 కిలోగ్రాములకు పైగా మాదకద్రవ్యాలు, వాటి తయారీకి ఉపయోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కైరోలోని రెండు అపార్ట్మెంట్లను డ్రగ్స్ తయారీ ల్యాబ్లుగా ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. అక్కడి నుంచి లైసెన్సు లేని ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం 12 మందికి కోర్టు మరణశిక్ష విధించింది. మరో తొమ్మిది మంది నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించగా.. తగిన సాక్ష్యాధారాలు లభించకపోవడంతో ఏడుగురిని నిర్దోషులుగా విడుదల చేసింది. ఈజిప్టు న్యాయ ప్రక్రియలో భాగంగా మరణశిక్షను ఖరారు చేయడానికి ముందు గ్రాండ్ ముఫ్తీ అభిప్రాయాన్ని తీసుకున్నారు. అయితే తుది నిర్ణయం కోర్టుదే. సారా ఖలీఫా మొదటి నుంచీ తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ వస్తున్నారు. తాను నిర్దోషినని కోర్టులో వాదించారు. గత ఏడాది విచారణ సందర్భంగా.. మాదకద్రవ్యాల నిరోధక శాఖ కార్యాలయానికి వెళ్లే ముందు డ్రగ్స్ లేదా సిగరెట్లను తాను ఎప్పుడూ ఉపయోగించలేదని న్యాయమూర్తికి తెలిపారు. తాజా తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేయనున్నట్లు ఆమె న్యాయవాది వెల్లడించారు.