నారాయణ స్కూల్ బస్సు అద్దం పగలడంతో జారిపడ్డ విద్యార్థి !
ఆంధ్రప్రదేశ్ లోని చీరాల కొత్తపేటలోని నారాయణ పాఠశాల బస్సులో ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అద్దం పగలడంతో అదే పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న జాషువా డేనియల్ బస్సు నుంచి జారిపడి తీవ్రంగా గాయపడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విద్యార్థి తల్లి తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదంలో తన కుమారుడి కంటి సమీపంలో తీవ్ర గాయమైందని, కంటి పక్కన ఉన్న ఎముక విరిగినట్లు వైద్యులు తెలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుడి పరిస్థితి చూసి కుటుంబం తీవ్ర ఆందోళనకు గురవుతోందన్నారు. ప్రమాదం జరిగిన అనంతరం పాఠశాల యాజమాన్యం తమ కుటుంబాన్ని పట్టించుకోలేదని, ఘటనపై ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని తల్లి ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి తమ కుటుంబానికి అండగా నిలిచి, విద్యార్థికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.