నిమ్స్ ఆస్పత్రిలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి : నిందితుడి వివరాలను సేకరించే పనిలో పోలీసులు
హైదరాబాద్ లోని పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స కోసం వచ్చిన యువతిపై ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడం కలకలం రేపుతోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదంలో యువతికి రెండు కాళ్లు విరగడంతో ఆమెను కుటుంబసభ్యులు నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న సమయంలో తెల్లవారుజామున 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో పక్క బెడ్లో ఉన్న మరో రోగి అటెండెంట్ యువతిపై అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో వ్యక్తి ప్రవర్తనతో యువతి తీవ్ర భయాందోళనకు గురైంది. వెంటనే జరిగిన విషయాన్ని యువతి మరుసటి రోజు తన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. ఈ విషయంపై యువతి తండ్రి, ఆర్ఎంపీ వైద్యుడు.. పోలీసులను ఆశ్రయించారు. యువతి తండ్రి, బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి వివరాలను సేకరించే పనిలో ఉన్నారు.