ఆర్బీఐ అంచనాలను తారుమారు చేస్తూ మొదటి త్రైమాసికం జీడీపీ పెరుగుదల

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాలను తారుమారు చేస్తూ 2026-2027 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.8 శాతానికి పెరిగింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు అంతకుముందు త్రైమాసికం (8.6 శాతం) కంటే తక్కువగా ఉంది. కానీ గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికం కంటే ఇప్పుడు కాస్త ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. గత ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 6.9 శాతం వృద్ధిని నమోదు చేయగా, ఇప్పుడు 7.8 శాతం నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికం కంటే ఇప్పుడు జీడీపీ వృద్ధి రేటు పెరగడం విశేషంగా చెప్పవచ్చు. ఈ మేరకు సోమవారం కేంద్రం జీడీపీ వృద్దికి సంబంధించి కీలక గణాంకాలను విడుదల చేసింది. 2026-27 ఆర్దిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆర్థిక, రియల్ ఎస్టేట్, ఐటీ, వృత్తిపరమైన సేవల రంగాలు భారతదేశ వృద్ధిని పెంచినట్లు కేంద్రం తెలిపింది. మొదటి త్రైమాసికంలో వాస్తవ జీడీపీ లేదా స్థిర ధరల వద్ద జీడీపీ రూ. 81.36 లక్షల కోట్లుగా అంచనా వేశారు. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 75.46 లక్షల కోట్లుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక అనిశ్చితి, ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగాన్ని కొనసాగించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. భారతదేశ వృద్ధికి భారతీయుల 'కఠోర శ్రమ' కారణమని ప్రశంసించింది. 'ఈ బలమైన పనితీరుకు కారణం భారత ప్రజల కృషి. ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, ఆర్థిక వ్యవస్థ చురుకైన నిర్వహణతో కలిసి ఫలితాలనిస్తున్నాయి. మన పౌరులందరికీ ఆర్థిక అవకాశాలను మరింతగా విస్తరించడానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది' అని ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కాగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెరిగిన ఇంధన ధరలు, ప్రపంచ వాణిజ్యంపై అనిశ్చితి నేపథ్యంలో ఈ జీడీపీ వృద్ది అంచనాలు చర్చనీయాంశంగా మారాయి. అంతర్జాతీయంగా ఆర్ధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆర్థిక కార్యకలాపాలకు దేశీయ డిమాండ్ కీలక మద్దతుగా నిలిచింది. 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org