ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు : ఆరుగురు మృతి, 20 మందికి గాయాలు!
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో బుధవారం తెల్లవారుజామున 65వ జాతీయ రహదారిపై ఐరన్ లోడుతో రోడ్డుపై ఆగి ఉన్న లారీని వేగంగా వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ నిద్రమత్తు, ఓవర్ స్పీడే యాక్సిడెంట్ కు కారణమని తెలుస్తుంది. బస్సు హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా తెల్లారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ఉన్నారు. వీరిలో 20 మందికి గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద శబ్దం విన్న స్థానికులు, వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను క్షతగాత్రుల నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న కోదాడ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ధాటికి బస్సు ముందు భాగం తీవ్రంగా నుజ్జునుజ్జయ్యి, మృతదేహాలు బస్సులోనే చిక్కుకుపోవడంతో వాటిని వెలికితీయడానికి కష్టపడాల్సి వచ్చింది.