నెదర్లాండ్స్, వెనిజులా దేశాలకు చెందిన మహిళలపై పాకిస్తాన్లో గ్యాంగ్ రేప్ : నిందితుల్లో డిప్యూటీ పీఎం బంధువు
పాకిస్తాన్లోని లాహోర్లో ఇద్దరు విదేశీ మహిళలపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ బంధువుతో సహా నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను మొహమ్మద్ రజా దార్, హసన్ రజా, సికందర్ ఖాన్, సాజిద్ అలీగా గుర్తించారు. లాహోర్ కోర్టు వీరిని ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. ఈ కేసులో ఐదో నిందితుడు పరారీలో ఉండగా, అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మొహమ్మద్ రజా దార్, పాక్ డిప్యూటీ పీఎం ఇషాక్ దార్కు బంధువు కావడంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని అత్యంత సున్నితమైనదిగా పరిగణిస్తున్నారు. జూన్ 29న నెదర్లాండ్స్, వెనిజులా దేశాలకు చెందిన ఇద్దరు మహిళలను ఐదుగురు వ్యక్తులు అపహరించి, సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి తండ్రి స్పెయిన్ నుండి అధికారులకు సమాచారం అందించడంతో పోలీసులు రంగంలోకి దిగి మహిళలను రక్షించారు. కిడ్నాప్, గ్యాంగ్ రేప్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. బాధితుల కథనం ప్రకారం వారికి గత అక్టోబర్లో సింగపూర్లో రజా దార్తో పరిచయం ఏర్పడింది. వీరంతా క్రిప్టోకరెన్సీ వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్నారని, పాకిస్తాన్ సందర్శన కోసం రజా దార్నే వారికి బిజినెస్ వీసాలు ఏర్పాటు చేశాడని విచారణలో తేలింది. జూన్ 29న వారు లాహోర్ చేరుకున్న వెంటనే రజా దార్, అతని అనుచరులు వారిని కిడ్నాప్ చేసి ఒక ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని, విడుదల చేయడానికి డబ్బులు కూడా డిమాండ్ చేశారని మహిళలు ఆరోపించారు. కోర్టు విచారణలో బాధితులు రజా దార్ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. ప్రస్తుతం ఈ కేసుపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.