ముంబైలో కుండపోత వర్షాల కారణంగా అతలాకుతలమైన జనజీవనం : 24 గంటల్లో 200 మి.మీ వర్షపాతం నమోదు
ముంబైలో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలమైంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 200 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దాదర్, పార్లే, హింద్మాతా, చార్కోప్, వర్లీ, గోరేగావ్, అంధేరీ వంటి కీలక పల్లపు ప్రాంతాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. భారీగా వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంబయి నగర జీవనరేఖ అయిన లోకల్ రైళ్ల సర్వీసులపై వరద ప్రభావం తీవ్రంగా పడింది. చాలా చోట్ల రైల్వే పట్టాలు నీట మునగడంతో లోకల్ రైళ్లు షెడ్యూల్ సమయం కంటే గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి. గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం ముంబై నగరం మరియు దాని శివారు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. వానలతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని పేర్కొంది. అలాగే, గురువారం రాత్రి సముద్రంలో హైటైడ్ \ కారణంగా అలలు ఏకంగా 4.27 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడే అవకాశం ఉందని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.