ఫిరాయింపు గ్రూపులను గుర్తించొద్దంటూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖరాసిన శివసేన
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు పార్టీ ఎంపీల ఫిరాయింపులను అడ్డుకునేందుకు శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) బుధవారంనాడు లేఖ రాసింది. పార్లమెంటులో శివసేన యూబీటీ మాత్రమే అధికారిక గుర్తింపు కలిగిన పార్టీ అని ఆ లేఖలో తెలియజేసింది. పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఆదేశాల మేరకు స్పీకర్ ఓం బిర్లాకు అధికారికంగా సమాచారం ఇచ్చినట్టు పార్టీ ఎంపీ, పార్లమెంటరీ నేత అరవింద్ సావంత్ తెలిపారు. శివసేన యూబీటీతో అనుబంధం కలిగిన ఏ చీలక వర్గానికి కానీ, తిరుగుబాటు వర్గం లేదా స్వతంత్ర గ్రూపునకు ఎలాంటి గుర్తింపు, హోదా, సౌకర్యం, ప్రత్యేక హక్కులు, గుర్తింపు ఇవ్వరాదని ఆ లేఖలో స్పీకర్ను కోరినట్టు చెప్పారు. ప్రత్యేక హోదా కోరుతూ ఎవరైనా స్పీకర్ను ఆశ్రయిస్తే ముందుగా శివసేన (యూబీటీ) వాదన వినకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని ఆ లేఖలో అరవింద్ సావంత్ కోరారు. పార్టీ ఫిరాయింపు నిబంధలను తేలియజేసే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ కింద లీగల్ రెమెడీ పొందే హక్కు తమకు ఉంటుందని అన్నారు. ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి చెందిన తొమ్మిది మంది ఎంపీల్లో ఏడుగురు పార్టీ ఫిరాయింపులకు పాల్పడే అవకాశం ఉందనే ఊహాగానాల నేపథ్యంలో ఈ తాజా పరిణామం చోటుచేసుకుంది. 'ఆపరేషన్ టైగర్' పేరుతో ఫిరాయింపుల పర్వం నడుస్తోందని, ఇందులో భాగంగా ఏడుగురు శివసేన యూబీటీ ఎంపీలు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే నివాసంలో బుధవారంనాడు కలుసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఇద్దరు ఎంపీలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. మరో నలుగురు ఈరోజు ఢిల్లీకి చేరుకుంటారని తెలుస్తోంది. స్పీకర్ ఓం బిర్లాను కలుసుకునే ముందు వీరంతా శ్రీకాంత్ షిండే నివాసంలో సమావేశమయ్యే అవకాశం ఉంది.