మహిళా సంఘాలకు 553 ఆర్టీసీ బస్సులు : అద్దె ప్రాతిపదికన నడుపనున్న టీజీఎస్ఆర్టీసీ
తెలంగాణలో 'ఇందిరా మహిళా శక్తి' పథకంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలను కేవలం ప్రయాణికులుగా కాకుండా, బస్సుల యజమానులుగా మార్చే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే భారీ 'మహిళాశక్తి సభ'లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సంఘాలకు 553 ఆర్టీసీ బస్సులను అధికారికంగా అందజేసి, జెండా ఊపి ప్రారంభించనున్నారు. వీటిలో తాజాగా జోడించిన 400 కొత్త ఇందిరా మహిళా శక్తి బస్సులు కూడా ఉన్నాయి. ఈ పథకం ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలు కేవలం రవాణా వ్యవస్థలో భాగస్వాములుగా మారడమే కాకుండా, అద్భుతమైన స్థిర ఆదాయాన్ని పొందనున్నాయి. మహిళా సంఘాల ద్వారా బ్యాంకురుణాల సహాయంతో రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ఈ బస్సులను కొనుగోలు చేయించింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టీజీఎస్ఆర్టీసీ ఈ 553 బస్సులను అద్దె ప్రాతిపదికన నడుపుతుంది. బస్సులకు అవసరమైన డ్రైవర్లు, కండక్టర్లను ఆర్టీసీ యాజమాన్యమే సమకూరుస్తుంది. డ్రైవర్, కండక్టర్ జీతభత్యాలు, ఇతర నిర్వహణఖర్చులు పోను ఒక్కో బస్సుకు ప్రతి నెల రూ.69,468 అద్దె రూపంలో నేరుగా మహిళాసంఘాల ఖాతాల్లో జమ అవుతుంది.