అనూహ్యంగా నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ ఉదయం ప్రారంభంలో నష్టాల ఊబిలో కూరుకుపోయిన సూచీలు, ట్రేడింగ్ ముగిసే సమయానికి అనూహ్యంగా పుంజుకుని లాభాల బాట పట్టాయి. ఈరోజు ఉదయం మార్కెట్లు ప్రారంభం కావడమే భారీ నష్టాలతో మొదలయ్యాయి. అంతర్జాతీయ ప్రతికూల పవనాలు, ముడిచమురు ధరల పెరుగుదల భయాల మధ్య సెన్సెక్స్ ఒకానొక దశలో ఏకంగా 1,526 పాయింట్ల మేర పతనమై ఇన్వెస్టర్లను వణికించింది. అయితే మధ్యాహ్నం తర్వాత పరిస్థితి తలకిందులైంది. కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు కోలుకున్నాయి. చివరకు సెన్సెక్స్ 185.23 పాయింట్ల లాభంతో 73,319 వద్ద, నిఫ్టీ 33.70 పాయింట్ల స్వల్ప లాభంతో 22,713 వద్ద స్థిరపడ్డాయి. నేటి రికవరీలో ఐటీ రంగం కీలక పాత్ర పోషించింది. హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థల షేర్లలో భారీగా కొనుగోళ్లు జరిగాయి. వీటికి తోడు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అండగా నిలిచింది. మరోవైపు.. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ ఏకంగా 157 పైసలు బలపడి 93.13 వద్ద నిలవడం మార్కెట్ సెంటిమెంట్ను బలపరిచింది.