గుజరాత్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు
గుజరాత్, భరూచ్ జిల్లా ఝగాడియా జిఐడిసి పరిధిలోని మెట్రోపాలిటన్ ఎక్సిమ్కెమ్ అనే కెమికల్ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. ఈ ధాటికి ఫ్యాక్టరీలో పనిచేస్తున్న పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ ప్రాంగణంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక యంత్రాలను రంగంలోకి దించారు. గాయపడిన కార్మికులను అంబులెన్స్లలో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం ఎలా జరిగింది? రియాక్టర్లో మంటలు చెలరేగడం వల్ల పేలుడు సంభవించిందా లేదా ఇతర సాంకేతిక లోపాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో ఎంతమంది ఉన్నారనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో జిఐడిసి ప్రాంతంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి.