ఫ్లిప్కార్ట్ లో 300 మంది ఉద్యోగులకు ఉద్వాసన ?
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ తన వార్షిక పనితీరు సమీక్షలో భాగంగా దాదాపు 300 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సంస్థ తన వ్యాపారాలలో దాదాపు 20,000 మంది ఉద్యోగులను మాత్రమే కలిగి ఉంది. 2024 ప్రారంభంలో కూడా ఫ్లిప్కార్ట్ తన వార్షిక పనితీరు సమీక్షలో 5 శాతం లేదా 1000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు మరోమారు 300 మందిని తొలగించినట్లు తెలుస్తోంది. అయితే కంపెనీ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. ఫ్లిప్కార్ట్ భవిష్యత్తులో స్టాక్ మార్కెట్లో ఐపీఓ ద్వారా ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే.. సంస్థ గోల్డ్మన్ సాచ్స్, మోర్గాన్ స్టాన్లీ, జేపీ మోర్గాన్ & కోటక్ మహీంద్రా క్యాపిటల్ వంటి పెట్టుబడి బ్యాంకులతో ప్రారంభ చర్చలు జరుపుతోంది. కాగా కంపెనీ 2026 చివరలో లేదా 2027 ప్రారంభంలో ఐపీఓ చేయాలని లక్ష్యంగా పెట్టుకునే అవకాశం ఉంది. ఇటీవల ఫ్లిప్కార్ట్ తన సంస్థ నిర్మాణంలో కూడా కొన్ని మార్పులు చేసింది. కంపెనీకి సంబంధించిన హోల్డింగ్ సంస్థను సింగపూర్ నుంచి తిరిగి భారతదేశానికి మార్చడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ నుంచి ఆమోదం పొందింది. ఈ నిర్ణయం కంపెనీ భారతదేశంలో పబ్లిక్ లిస్టింగ్కు సిద్ధం కావడంలో ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.