విజయవాడ - మచిలీపట్నం మధ్య భారీ ఎలివేటెడ్ ఫ్లైఓవర్
హైదరాబాద్-మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణలో భాగంగా నగరం మధ్యలో దాదాపు 14 కిలోమీటర్ల పొడవైన భారీ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు డీపీఆర్ సిద్దం చేసారు. దీని ద్వారా విజయవాడ వాసులకు ట్రాఫిక్ సమస్యల నుంచి శాశ్వత విముక్తి లభించనుంది. భారీ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం ప్రతిపాదనలను సిద్దం చేసింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు, అటు మచిలీపట్నం నుంచి విజయవాడ శివారు వరకు రహదారిని ఆరు వరుసలుగా విస్తరిస్తున్నారు. కాగా, నిత్యం రద్దీగా ఉండే విజయవాడ నగర పరిధిలోని కనకదుర్గ ఫ్లైఓవర్ నుండి దావులూరు వరకు మాత్రం కేవలం నాలుగు వరుసల రోడ్డు మాత్రమే ఉంది. ఒకవేళ నగరం మధ్యలో రోడ్డును ఆరు వరుసలుగా మార్చకపోతే, నగరానికి ఇరువైపులా స్పీడుగా వచ్చే వాహనాలు నగరం లోపలికి రాగానే ట్రాఫిక్ జామ్ సమస్య వస్తుందని గుర్తించారు. దీంతో, ఇళ్ల సేకరణ అవసరం లేకుండా, గాల్లోనే వంతెన నిర్మించడమే ఏకైక మార్గమని అధికారులు నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగా పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలోని రాజీవ్ పార్క్ నుండి ప్రారంభించి బందరు వైపు వెళ్లే మార్గంలోని గంగూరు కూడలి వరకు ఈ ఆరు వరుసల ఫ్లైఓవర్ను ప్లాన్ చేస్తున్నారు.