మేడారం జాతర ప్రత్యేక బస్సుల్లో మహిళలతో పాటు పురుషులకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం
మేడారం జాతర ప్రత్యేక బస్సుల్లో మహిళలతో పాటు పురుషులకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఈ ఉచిత ప్రయాణ సదుపాయం ఫిబ్రవరి 1వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మేడారంలో తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు చేయడంతో పాటు, పస్రా నుంచి మేడారం వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఈ బస్సుల్లో మహిళ, పురుషులు అనే తేడా లేకుండా అందరికీ ఉచిత ప్రయాణం వర్తిస్తుంది. అలాగే, ప్రైవేట్ వాహనాల్లో వచ్చిన భక్తులు చింతల్ క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ ఏరియాలో వాహనాలను నిలిపి, అక్కడి నుంచి ఉచిత ఆర్టీసీ బస్సుల్లో మేడారంకు చేరుకునే అవకాశం కల్పించారు. ఇందుకోసం ప్రత్యేకంగా 20 బస్సులు నడుపుతున్నారు. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు ఈ ప్రత్యేక బస్సు సేవలను వినియోగించుకున్నారని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ విజయబాను తెలిపారు. జాతరకు ఇంకా రెండు రోజులు ఉండటంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.