బంగ్లాదేశ్ హైకమిషనర్కు భారత్ సమన్లు జారీ !
బంగ్లాదేశ్ ను అస్థిరపరిస్తే సెవన్ సిస్టర్స్ (7 ఈశాన్య రాష్ట్రాలు)ను ముక్కలు చేస్తామని బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీ(ఎన్సీపీ) నాయకుడు హస్నాత్ అబ్దుల్లా బహిరంగంగా హెచ్చరించారు. ఈ విషయమై ఆ దేశ హైకమిషనర్ మహ్మద్ రియాజ్ హమీదుల్లాకు భారత్ ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. బంగ్లాదేశ్లోని భారత దౌత్య కార్యాలయానికి బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో ఈ చర్యలకు ఉపక్రమించింది. బంగ్లాదేశ్లో భద్రతా పరిస్థితులు క్షీణించడంపై హమీదుల్లా ముందు భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఢాకాలోని ఇండియన్ ఎంబస్సీపై బంగ్లాదేశీయులు బెదిరింపులకు పాల్పడటాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. బంగ్లాలో ఇటీవల జరిగిన సంఘటనలకు సంబంధించి ఇండియాపై తప్పుడు కథనాలను పూర్తిగా తిరిస్కరిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ ఘటనలకు సంబంధించి తాత్కాలిక ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు నిర్వహించకపోవడం లేదా సరైన ఆధారాలను పంచుకోకపోవడం దురదృష్టకరమని భావిస్తూ అసంతృప్తి వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్తో భారత్ సన్నిహిత, స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది. ఆ దేశంతో శాంతి, స్థిరత్వాన్ని కోరుకుంటున్నామని, శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని పిలుపునిచ్చినట్టు గుర్తు చేసింది. తాత్కాలిక ప్రభుత్వం తన దౌత్య బాధ్యతలకనుగుణంగా బంగ్లాలోని భారత మిషన్లు, పోస్టుల భద్రతను నిర్ధారించాలని ఆశిస్తున్నట్టు ఇండియా స్పష్టం చేసింది.