తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు : ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదన్న సిట్
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా మారిన మాజీ అధికారి ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని జూబ్లీహిల్స్లోని సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో డిజిటల్ ఆధారాలే కీలకంగా మారడంతో, ప్రభాకర్ రావుకు సంబంధించిన ఐక్లౌడ్, జీ మెయిల్ ఖాతాలపై సిట్ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభాకర్ రావు వినియోగించిన ఐదు ఐక్లౌడ్, ఐదు జీ మెయిల్ ఖాతాల్లోని డేటాను సిట్ పరిశీలించింది. గతంలో ప్రభాకర్ రావు నాలుగు జీ మెయిల్ ఖాతాలు, రెండు ఐక్లౌడ్ ఖాతాల పాస్వర్డ్లు అందజేశారు. అయితే ఆ ఖాతాల్లో డేటా కనిపించకపోవడంతో, సిట్ అధికారులు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు డివైసులను పంపించారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి లభించిన సాంకేతిక నివేదికల ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నించారు. అయితే ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో సిట్ అధికారుల తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది.