నాలుగు కోట్ల విలువైన సొంత భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేసిన కోదండరెడ్డి
తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి నాలుగు కోట్ల విలువైన సొంత భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేశారు. ఈరోజు ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అధికారికంగా వ్యవసాయ శాఖకు కోదండరెడ్డి రిజిస్ట్రేషన్ చేశారు. ఈ ప్రక్రియలో వ్యవసాయ శాఖ తరఫున రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి ఉషా, ఏడీఏ సుజాత, ఏవో రవినాధ్ పాల్గొన్నారు. కోట్ల విలువు చేసే భూమిని ప్రభుత్వానికి అప్పగించడంపై ప్రజలు, అధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. రెండు నెలల క్రితమే తన సొంత గ్రామం అయినా యాచారం గ్రామంలోని నాలుగు కోట్ల విలువ చేసే 2 వేల గజాల స్థలాన్ని, అందులో వున్న భవనాన్ని వ్యవసాయశాఖకు రాసివ్వనున్నట్లు కోదండరెడ్డి ప్రకటించారు. యాచారం మండలంలోని రైతులు పండించే ఉత్పత్తుల నిల్వ, ఇతర వ్యవసాయ పరికరాలు, పనిమొట్లు పెట్టుకోడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంది. శాశ్వతంగా రైతులకు ఉపయోగకరంగా ఉండాలంటే ప్రభుత్వానికి రాసిస్తే బాగుంటదనే ఆలోచనతో కోదండరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గతంలోనే ఈ విషయాన్ని స్వయంగా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును కలిసి చెప్పారు. దానికి సంబందించి అధికారికంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ రోజు ముగిసింది.