పిల్లలకు మితిమీరిన సంఖ్యలో ఇస్తున్న టీకాల వల్ల ఆటిజం కేసులు పెరిగే అవకాశం !
దేశంలో ఆటిజం కేసులు పెరుగుతున్నాయని, దీనికి తల్లిదండ్రులు పిల్లలకు ఇప్పిస్తున్న టీకాలు కూడా కారణమని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు ఎక్స్ వేదికగా అభిప్రాయపడ్డారు. ఇది ఆన్లైన్లో వైరల్గా మారింది. మెక్ కలౌ ఫౌండేషన్ నివేదిక ఫలితాలను వెంబు ఉటంకించారు. 300కు పైగా అధ్యయనాలను సమీక్షించి రూపొందించిన ఈ నివేదికలో రెండేళ్లలోపు పిల్లలకు సుమారు 32 టీకాలు వేయిస్తున్నట్లు చెప్పారు. ఇది ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ కు కారణమవుతున్నట్లు తెలిపారు. వెంబు తన పోస్ట్లో 'తల్లిదండ్రులు ఈ విశ్లేషణను తీవ్రంగా పరిగణించాలి. చిన్న పిల్లలకు మితిమీరిన సంఖ్యలో టీకాలు ఇస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఇండియాలోనూ ఆటిజం వేగంగా పెరుగుతున్నట్లు తెలుస్తుంది' అని పేర్కొన్నారు. వెంబు వ్యాఖ్యలు ఆన్లైన్లో చర్చకు దారితీశాయి. కొందరు నెటిజన్లు ఆయన పోస్ట్కు మద్దతు తెలుపుతూ 'ఈ మెసేజ్ను పంపడానికి చాలా ధైర్యం కావాలి' అని ప్రశంసించగా, మరికొందరు టీకాల ఆవశ్యకతను, అవి ప్రాణాంతక వ్యాధులను నివారించడంలో పోషించిన పాత్రను నొక్కి చెబుతూ విమర్శిస్తున్నారు. ఆటిజం అనేది ఒక న్యూరోడెవలప్మెంటల్ డిజార్డర్. దీన్ని సాధారణంగా ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అని పిలుస్తారు. ఇందులో స్పెక్ట్రమ్ అనే పదం ఈ వ్యాధి లక్షణాలు, తీవ్రత వ్యక్తినిబట్టి వైవిధ్యంగా ఉంటాయని సూచిస్తుంది. ఆటిజం లక్షణాలు సాధారణంగా చిన్న వయస్సులోనే (సాధారణంగా 2 సంవత్సరాల వయస్సులోపు) బయటపడుతాయి. తల్లిదండ్రులు లేదా ఇతరులు పేరు పెట్టి పిలిచినా స్పందించకపోవడం, ఇతరుల భావాలను అర్థం చేసుకోలేకపోవడం లేదా వాటిని పంచుకోలేకపోవడం, ముఖ కవళికలను ఉపయోగించడంలో ఇబ్బంది పడటం వంటి లక్షణాలు ఆటిజంలో భాగంగా ఉన్నాయి.