హామీలు నెరవేర్చకుండా విజయోత్సవాలా ?


గత ఏడాది కాలంగా మార్పు పేరుతో ప్రజలను కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లోని కత్రియ హోటల్ వేదికగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ ఛార్జిషీట్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పేరు చెప్పి 66 మోసాలకు పాల్పడిందని కిషన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణలో మార్పు రావాలి. కాంగ్రెస్‌ కావాలనే నినాదంతో ప్రజలను నమ్మించి ఓట్లు దండుకొని ప్రభుత్వంలోకి వచ్చి ఏడాది పూర్తయ్యిందన్నారు. సంవత్సర కాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. వంద రోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్‌ మాట తప్పిందన్నారు. ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పాలనలో ఏ వర్గం సంతోషంగా లేదని.. కాంగ్రెస్‌ విజయోత్సవాలను చూసి ప్రజలంతా ఆశ్చర్యపోతున్నారన్నారు. విజయోత్సవాల పేరుతో కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. హామీలు నెరవేర్చకుండా సంబురాలేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ప్రజలను వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. రుణమాఫీ ఇప్పటి వరకు రైతులందరికీ కాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా 15వ ఆర్థిక ప్రణాళిక సంఘం నుంచి నిధులు ఇస్తుందని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరుపై ప్రజలు ఆందోళనలో ఉన్నారని.. ప్రజా ఉద్యమాల ద్వారానే వారికి బుద్ధి చెప్పాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలపై చర్చకు తాము సిద్ధమేనన్నారు. రాష్ట్రంలో చేస్తున్న కులగణను బీజేపీ వ్యతిరేకించడం లేదన్నారు. పరిశ్రమల కోసం రైతులను ఒప్పించి భూములను తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌ సమావేశాల్లోపే చర్లపల్లి రైల్వేస్టేషన్‌ను ప్రారంభించనున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీలు డీకే అరుణ, రఘునందన్‌, ఈటల రాజేందర్‌, నగేశ్‌, ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, రామారావు పాటిల్‌, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పాల్వాయి హరీష్‌, పైడి రాకేశ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org