ట్రేడింగ్లో నష్టపోయిన కుమారుడి మరణాన్ని తట్టుకోలేక తల్లి ఆత్మహత్యాయత్నం !
ఆన్లైన్ ట్రేడింగ్లో లక్షల రూపాయలు నష్టపోయిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడగా ఒక్కగానొక్క కొడుకు మరణాన్ని తట్టుకోలేక కన్నతల్లి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా హయత్నగర్ పోలీసు ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా హయత్నగర్ సూర్యనగర్ కాలనీ రోడ్డునంబరు-2లో తాటికొండ లూర్దమ్మ, శ్రీనివాస్రెడ్డి దంపతులు కుమారుడు అఖిల్రెడ్డి (24)తో కలిసి ఉంటున్నారు. శ్రీనివాస్రెడ్డి సివిల్ కాంట్రాక్టర్. లూర్దమ్మ సంగారెడ్డి జిల్లా సదాశివపేట్లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో పారామెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అఖిల్ రెండేళ్ల క్రితం బీటెక్ పూర్తిచేసి ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తున్నారు. కొన్నాళ్లుగా సుమారు రూ.20 లక్షల మేర నష్టపోయారు. దీంతో మనోవేదన తట్టుకోలేక గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నారు. మధ్యాహ్న సమయంలో తల్లి ఫోన్చేసినా స్పందించకపోవడంతో ఇంట్లో అద్దెకుంటున్న వారితో మాట్లాడగా వారు వెళ్లి చూసేసరికి అఖిల్ ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించారు. కుమారుడి బలవన్మరణాన్ని తట్టుకోలేక తల్లి లూర్దమ్మ గురువారం అర్ధరాత్రి బాత్రూమ్ శుభ్రం చేసే రసాయనాన్ని తాగారు. గమనించిన కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.