లావోస్ చేరుకున్న ప్రధాని మోడీ !
ఆసియాన్-భారత్, తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనడానికి లావోస్లోని వియంటియాన్ కు ప్రధాని నరేంద్ర మోడీ చేరుకున్నారు. ప్రధాని మోడీకి సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ హానర్ లభించింది. ఆసియాన్ దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకునే లక్ష్యంతో ఈ పర్యటన కొనసాగనుంది. లావోస్లో జరగనున్న 21వ ఆసియాన్ భారత్, 19వ తూర్పు ఆసియా సదస్సులో ప్రధాని మోడీ పాల్గొంటారు. లావోస్ పర్యటన ఆసియాన్ దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని మోడీ పేర్కొన్నారు. ప్రధాని మోడీకి స్థానిక డబుల్ ట్రీ హోటల్లో ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. చిన్నారులను ఆప్యాయంగా పలకరించి ఆటోగ్రాఫ్లు ఇచ్చారు. మోడీకి ఎన్నారైలు జాతీయ జెండాలు, కళాకృతులు అందజేశారు. అనంతరం స్థానిక యువకులతో కలిసి ప్రధాని మోడీ గాయత్రీ మంత్రం సహా వివిధ శ్లోకాలను పఠించారు. బౌద్ధ భిక్షువులతో కలిసి ప్రధాని మోడీ ప్రార్థనలు చేశారు. లావోస్ సంస్కృతి, వారసత్వ కట్టడాలు, ప్రాచీన కళల వివరాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ప్రధాని తిలకించారు.