రేపు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం !
రేపు ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక ప్రతిపాదనలపై చర్చించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్లో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై కేబినెట్ నిర్ణయించే అవకాశం ఉంది. చెత్త పన్ను రద్దు ప్రతిపాదనపై చర్చించి రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై కేబినెట్ చర్చించనుంది. రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణకు కేబినెట్ ముందుకు ప్రతిపాదన రానుంది. దేవాలయాల పాలక మండలిని 15 మంది నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపైనా క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. దేవాలయాల్లో ఛైర్మన్ సహా 17 మంది పాలక మండలి సభ్యుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న 1200 పైగా దేవాలయాల్లో ఈ నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్ర శాసనసభ నిర్వహణ, ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఆరు నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశ పెట్టే అంశంపై చర్చించే అవకాశం ఉంది. మల్లవల్లి పారిశ్రామిక పార్కులో భూ కేటాయింపుల విషయమై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.