పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.2,800 కోట్లు విడుదల !
ఆంధ్రప్రదేశ్ లోని పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూ. 2,800 కోట్ల నిధులను విడుదల చేసింది. పాత బిల్లుల రీయింబర్స్ మెంట్ కింద రూ.800 కోట్లు, అడ్వాన్సుగా పనులు చేపట్టేందుకు రూ. 2000 కోట్లు విడుదల చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభం అయ్యాక కేంద్రం నుంచి ఇంత వేగంగా సానుకూల నిర్ణయాలు తీసుకోవడం, నిధుల మంజూరు కావడం ఇదే తొలిసారి అని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. 2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వం తొలుత సొంత నిధులతో పనులు చేయిస్తే వాటికి కేంద్రం దశలవారీగా డబ్బు చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 6వేల కోట్లు, వచ్చే ఏడాది రూ. 6,157 కోట్లు మంజూరుకు కేంద్రం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.