హైదరాబాద్కు స్క్వాబ్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ !
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యాంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సాగుతోంది. ఇప్పటికే పలు కంపెనీల ప్రతినిధులతో రేవంత్ బృందం భేటీ అయ్యింది. తాజాగా ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ప్రపంచంలో పేరొందిన చార్లెస్ స్క్వాబ్ కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా చార్లెస్ స్క్వాబ్ కంపెనీ హైదరాబాద్లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. భారత్లోనే ఈ కంపెనీ నెలకొల్పే మొదటి సెంటర్ ఇదే కావటం విశేషం. అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్లో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్బాబుతో ఈ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్లు డెన్నిస్ హోవార్డ్, రామ బొక్కా సారథ్యంలో ప్రతినిధులు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా టెక్నాలజీ అండ్ డెవెలప్మెంట్ సెంటర్ ఏర్పాటుపై కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. హైదరాబాద్లో ఈ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కంపెనీ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు అవసరమైన మార్గదర్శనం చేస్తామని చెప్పారు. తమ కంపెనీ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతుకు కంపెనీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు ఛార్లెస్ స్క్వాబ్ తుది అనుమతుల కోసం వేచి చూస్తోంది. త్వరలోనే తమ ప్రతినిధి బృందాన్ని హైదరాబాద్కు పంపించనున్నట్లు తెలిపింది. ఈ కంపెనీ విస్తరణతో ఆర్థిక సేవల రంగంలోనూ హైదరాబాద్ ప్రపంచం దృష్టిని ఆకర్షించనుంది.