బైక్ కొనివ్వలేదని తండ్రిని చంపిన కుమారుడు !
తెలంగాణలోని కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో బైక్ కొనివ్వలేదని ఆగ్రహానికి గురైన ఓ కుమారుడు తండ్రిని కర్రతో కొట్టి చంపాడు. ఎస్ఐ విజయ్ కొండ కథనం ప్రకారం మద్నూర్కు చెందిన అర్జున్ (64), ఎల్లవ్వ దంపతులు రాళ్లు కొట్టుకుని జీవిస్తున్నారు. వీరి కుమారుడు వెంకట్ బైక్ కొనివ్వమని తండ్రిని అడిగాడు. బుధవారం రాత్రి కూడా అడిగితే, ఇప్పటికే అప్పు ఉందని, తర్వాత చూద్దామని అర్జున్ బదులిచ్చాడు. దీంతో కోపోద్రిక్తుడైన వెంకట్ కర్రతో తండ్రి తలపై బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావమైన అర్జున్ అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హాస్పిటల్కు తరలించారు.