పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం !
ఆగస్టు 12 వరకు జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే దివంగత వియత్నాం నాయకుడు గుయెన్ ఫు ట్రోంగ్ (80)కు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. బంగాల్లోని అసన్సోల్ నియోజకవర్గం నుంచి గెలిచిన శత్రుఘ్న సిన్హా లోక్సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సభ్యులు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ సందర్భంగా ఎంపీ రాహుల్ గాంధీ ప్రశ్నిస్తూ ధనికులుగా ఉంటే పరీక్ష పేపర్లు కొనవచ్చనే చాలా మందికి అభిప్రాయం ఉందని అన్నారు. దానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేద్ర ప్రధాన్ సమాధానిస్తూ తమ ప్రభుత్వం పరీక్ష పేపర్లు లీక్ కాకుండా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రాజకీయాల కోసమే నీట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ్టి సమావేశాల్లో.. పార్లమెంట్లో కేంద్రం ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనుంది. మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికిగానూ మిగిలిన 8 నెలలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాల్లో ఆరు బిల్లులను సభ ఆమోదం కోసం కేంద్రం తీసుకురానుంది.