ఏక్నాథ్ షిండేతో చంద్రబాబు నాయుడు భేటీ !
అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ వివాహ రిసెప్షన్ కు ముంబై వెళ్లిన చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో సమావేశం అయ్యారు. కింజరాపు రామ్మోహన్ నాయుడితో కలిసి ఏక్నాథ్ షిండే నివాసానికి వెళ్లారు. వారికి సాదర స్వాగతం లభించిందక్కడ. షిండే, ఆయన తనయుడు కల్యాణ్ లోక్సభ సభ్యుడు శ్రీకాంత్ షిండే, మరికొందరు శివసేన చీలికవర్గ నాయకులు చంద్రబాబును కలిశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమిలో టీడీపీ, శివసేన (ఏక్నాథ్ షిండే) వర్గం భాగస్వామ్య పార్టీలుగా ఉన్న విషయం తెలిసిందే. ఏక్నాథ్ షిండేతో సుమారు 40 నిమిషాల పాటు చంద్రబాబు భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, పెట్టుబడులకు సంబంధించిన అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. ఈ భేటీకి సంబంధించిన వివరాలను ఏక్నాథ్ షిండే తన అధికారిక ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. సుదీర్ఘకాలం పాటు తమ ఈ రెండు రాష్ట్రాల మద్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయని, వాటిని మరింత బలోపేతం చేసుకుంటామని అన్నారు. చంద్రబాబుకు అపార రాజకీయ అనుభవం ఉందని గుర్తు చేశారు.