అడవిలో అమెరికా మహిళను కట్టేసిన ఘటనలో మాజీ భర్తపై హత్యాయత్నం కేసు !
మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో అమెరికాకు చెందిన లలితా కయీ కుమార్ అనే మహిళను (50)ను గుర్తుతెలియని వ్యక్తులు అటవీ ప్రాంతంలో చెట్టుకు గొలుసుతో బంధించిన ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ మహిళను ఆమె భర్తే అక్కడ బంధించి ఉంటాడనే అనుమానంతో పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం గోవా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు తన మాజీ భర్తే తనను అడవిలోకి తీసుకువెళ్లి, ఇనుప గొలుసులతో చెట్టుకు బంధించాడని, 40 రోజులుగా ఆహారం తీసుకోలేదని కాగితంపై రాసి చూపినట్లు పోలీసులు పేర్కొన్నారు. మహిళ రాసిన నోట్ ఆధారంగా ఆమె మాజీ భర్తపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఆ మహిళ బాగా నీరసంగా ఉండడంతో వాంగ్మూలం ఇచ్చే పరిస్థితిలో లేదని చెప్పారు. పరిస్థితి మెరుగయ్యాక వాంగ్మూలాన్ని అధికారికంగా నమోదు చేస్తామన్నారు. ఆమె దగ్గర లభించిన మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం ఆమె మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోందన్నారు. ఆమె భర్త, ఇతర బంధువుల సమాచారం తెలుసుకోవడానికి పోలీసు బృందాలు తమిళనాడుకు వెళ్లాయని పేర్కొన్నారు. అమెరికాకు చెందిన లలితా కయీ కుమార్ను గుర్తుతెలియని వ్యక్తులు అటవీ ప్రాంతంలో చెట్టుకు గొలుసుతో బంధించి వెళ్లారు. ఆకలితో అలమటిస్తూ, వర్షంలో తడిసి నీరసించిపోయిన ఆమె ఆర్తనాదాలు విన్న గొర్రెల కాపరి ఒకరు సోమవారం పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని బాధితురాలిని కాపాడి ఆసుపత్రికి తరలించారు.