ఇథియోపియా వరదల్లో 157 మంది మృతి
ఇథియోపియాను భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. మరోవైపు పెద్ద ఎత్తున బురద జలాలు ఏరులైపారడంతో 157 మంది ప్రాణాలు కోల్పోయారు. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది పలువుర్ని కాపాడారు. అలాగే మృతదేహాలను కూడా బురదలో నుంచి బయటకు తీశారు. సోమవారం ఉదయం బురదలో ప్రజలు సమాధి అయ్యారని అధికారులు తెలిపారు. స్థానిక అధికారి దగ్మావి అయేలే ప్రకారం.. ఇథియోపియాలోని రిమోట్ కెంచో షాచా గోజ్డి జిల్లాలో భారీ వర్షం కారణంగా బురదలో కూరుకుపోయి పిల్లలు, గర్భిణీ స్త్రీలతో సహా 157 మంది మరణించారని తెలిపారు. పలువుర్ని రెస్క్యూ సిబ్బంది రక్షించినట్లు పేర్కొన్నారు. ఐదుగురు సజీవంగా బయటపడ్డారని వెల్లడించారు. కుటుంబాలు బురదలో చిక్కుకుని ప్రాణాలు వదిలారని చెప్పారు. ఈ వర్షాలు సెప్టెంబర్ వరకు కొనసాగుతాయని దగ్మావి అయేల్ స్పష్టం చేశారు.