ఆంధ్రప్రదేశ్ లో నేడు, రేపు వర్షాలు !
ఆంధ్రప్రదేశ్ లో నేడు, రేపు కొన్ని జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు పడొచ్చని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదే పరిస్థితి మరో 48 గంటల పాటు కొనసాగే అవకాశాలు లేకపోలేదని అధికారులు అంచనా వేస్తోన్నారు. పిడుగులు పడే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల కింద నిల్చోకూడదని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ సూచించారు.