హిందూపురంలో తొలి అన్న క్యాంటీన్ ప్రారంభం !
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పేదలకు పట్టెడు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు మళ్లీ ప్రారంభమవుతున్నాయి. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన 64వ పుట్టినరోజు సందర్భంగా తన నియోజకవర్గ పరిధిలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఐదు రూపాయలకే పేదలకు పట్టెడు అన్నం పెట్టిన అన్న క్యాంటీన్లు వైసిపి ప్రభుత్వం రాగానే మూతపడ్డాయి. ఆ తర్వాత పలుచోట్ల టిడిపి నేతలు స్వయంగా వీటిని తిరిగి ప్రారంభించి, విజయవంతంగా నడుపుతున్నారు. గతంలో ఏపీలో వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసివేసి నిరుపేదలకు పట్టెడు అన్నం కూడా దొరకని పరిస్థితి తీసుకువచ్చిందని అనేకమార్లు తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. గతంలో టిడిపి హయాంలో ప్రారంభించిన అన్న క్యాంటీన్లు తొలి సంవత్సరంలోనే దాదాపు 7.25 కోట్ల మందికి భోజనం అందించాయని, టీడీపీ హయాంలో చాలా బాగా నడిచి పేదల ఆకలి తీర్చిన అన్నా క్యాంటీన్లను మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వస్తే పునరుద్ధరిస్తామని తెలుగుదేశం పార్టీ నేతలు, సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీలో అన్న క్యాంటీన్లు మళ్లీ ప్రారంభం కావడం ఏపీ వాసులకు సంతోషం కలిగిస్తుంది. ఇప్పటికే ఏపీలోనే అనేక ప్రాంతాలలో మూసివేతకు గురైన అన్న క్యాంటీన్లను మళ్ళీ ఓపెన్ చేసి శుభ్రం చేసి నిర్వహించేందుకు సిద్ధం చేస్తుంటే తాజాగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన 64వ పుట్టినరోజు సందర్భంగా తన నియోజకవర్గ పరిధిలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన కారణంగా తన నియోజకవర్గ పరిధిలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన బాలకృష్ణ తన పుట్టినరోజు నాడు మళ్ళీ మొట్టమొదటి అన్న కాంటీన్ ను రాష్ట్రంలో ప్రారంభించడం సంతోషంగా ఉందని వెల్లడించారు.